Fri Dec 05 2025 13:21:52 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : అతి భారీ వర్షాలట.. సామీ.. ఈ జిల్లా వాళ్లు అలెర్ట్ గా ఉండాల్సిందే
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ వాఖ తెలిపింది

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ వాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల వల్ల కుండపోత వర్షం కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ వాసులు అలెర్ట్ గా ఉండాలని మాత్రం వాతావరణ శాఖ సూచించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పిడుగులు పడే అవకాశముందని, పశువుల కాపర్లు, రైతులు పొలం పనులకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణాలో ఈ నెల14 వరకూ...
తెలంగాణలో ఈ నెల 14వ తేదీ వరకూ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముదని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు తెలంగాణలోని మహబూబాబాద్, సూర్యాపేట్, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరి, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ అకాల వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అదే సమయంలో ఉరుములు మెరుపులుతో కూడిన వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో రానున్న నాలుగు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లోనూ రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని తెలిపింది. విద్యుత్తు స్థంభాలు, చెట్ల వద్ద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఏన్టీఆర్, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ చెప్పింది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. కొన్ని జిల్లాలకు అమరావతి వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దీంతో పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు.
Next Story

