Wed Mar 25 2026 03:26:38 GMT+0530 (India Standard Time)
ఊహల్లో కేసీఆర్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ఏమయిందో కేసీఆర్ చెప్పాలన్నారు

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ఏమయిందో కేసీఆర్ చెప్పాలన్నారు. ధరణి కారణంగా రైతుల ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు. ఇప్పటి వరకూ రైతుల రుణ మాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ఊహల్లో విహరిస్తున్నారని అన్నారు. గురుకులాల్లో కనీస వసతులు లేవన్న కిషన్ రెడ్డి విద్యావ్యవస్థను ఈ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు.
అన్నీ అబద్ధాలే...
అబద్దాలు చెప్పటంలో కల్వకుంట కుటుంబమే ప్రధమ స్థానంలో ఉంటుందన్నారు. అప్పులు తేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. భూములు అమ్మకుండా గడపలేని పరిస్థిితి ఉందన్నారు. వ్యవసాయ మోటార్లకు కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టమని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదన్నారు. టీఆర్ఎస్ మరిన్ని రోజులు అధికారంలో కొనసాగితే విద్యుత్తు ఉత్పత్పి చేయలని పరిస్థితి ఏర్పడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ట్రాన్స్ కో, జెన్ కోలకు అప్పులు పేరుకు పోయి దివాలా స్థితికి చేరుకుంటుందన్నారు. మనిషి జీవితంలో విద్యుత్తు ఒక భాగమయిపోయిందని, అందుకే కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. రైతులను ఆదుకునేందుకు కేంద్రం అనేక పథకాలను తీసుకొచ్చిందన్నారు. రైతుల కోసం ఆరు లక్షల కోట్లు వ్యవసాయ బడ్జెట్ ను కేంద్రం పెట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు.
- Tags
- kishan reddy
- kcr
Next Story

