Mon Feb 02 2026 03:40:28 GMT+0000 (Coordinated Universal Time)
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు : తెలంగాణ హెల్త్ డైరెక్టర్
వృద్ధులు, పిల్లలు, గర్భిణులు వీలైనంతవరకూ ఇళ్లలోనే ఉండటం మంచిదన్నారు. ఎండల్లో విధులు నిర్వహించేవారు నీరు, పానీయాలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తెలంగాణలో ఎండల తీవ్రత మరింత ఎక్కువయింది. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర వైద్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
వృద్ధులు, పిల్లలు, గర్భిణులు వీలైనంతవరకూ ఇళ్లలోనే ఉండటం మంచిదన్నారు. ఎండల్లో విధులు నిర్వహించేవారు నీరు, పానీయాలు ఎక్కువగా తీసుకుంటుండాలని శ్రీనివాసరావు సూచించారు. కలుషితమైన నీరు, నిల్వ చేసిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామని చెప్పారు. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి, వారికి గాలి ఆడేలా చూడాలని, అరగంటలో కోలుకోకపోతే వెంటనే ఆస్పత్రికి తరలించాలని తెలిపారు.
Next Story

