Mon Dec 15 2025 08:41:05 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి పొంగులేటి కంటతడి.. ఆ కుటుంబాన్ని కాపాడలేకపోయామంటూ?
పాలేరులో సహాయక చర్యల్లో ఎదురైన సవాళ్లను మీడియాకు వివరిస్తూ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టారు

ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలోనే ఉండి సహాయక చర్యలను సమీక్షించారు.అయితే పాలేరులో సహాయక చర్యల్లో ఎదురైన సవాళ్లను మీడియాకు వివరిస్తూ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలో వరదల వల్ల నష్టపోయిన కూలీ కుటుంబం పరిస్థితిపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కుటుంబంలో ఒకరిని...
పాలేరులో ఇటుకల తయారీ కార్మికుడు యాకూబ్ కుటుంబాన్ని వరద నీటి నుంచి రక్షించాలని తాపత్రయపడ్డారు. అనేక రకాలుగా ఆయన ప్రయత్నాలు చేశారు. అయితే ఆ కుటంబంలో యాకూబ్ కొడుకును మాత్రమే సహాయక బృందాలు రక్షించాయి. మిగిలిన కుటుంబ సభ్యులను కాపాడలేకపోయారు. హెలికాప్టర్లను తరలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆ ఆపరేషన్ను అడ్డుకున్నాయని మంత్రి పొంగులేటి కంటతడి పడ్డారు. తాను హెలికాప్టర్లను తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేశానని, కానీ వాతావరణం సహకరించక పోవడంతో హెలికాప్టర్లు రాలేదన్నారు. ఆ దేవుడే మిగిలిన కుటుంబాన్ని రక్షించాలంటూ పొంగులేటి భావోద్వేగంతో చెప్పారు.
Next Story

