Thu Mar 19 2026 14:48:07 GMT+0530 (India Standard Time)
Raithu bandhu : తెలంగాణలో వారికి రైతు బంధు లేనట్లే.. నిరాశేకదా?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు పథకానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు పథకానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైతు బంధు అందరికీ అందే అవకాశం మాత్రం లేదు. రైతు భరోసా పథకాన్ని వచ్చే నెల సంక్రాంతి తర్వాత అమలు చేస్తామని, నిధులను లబ్డిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రైతు బంధు విషయంలో ఈ ముఖ్యమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రైతు బంధు పథకం కింద ఎకరాకు పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయాన్ని ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించారు. అయితే రైతు భరోసా పథకం తర్వాత రైతు బంధు పథకాన్ని కూడా అమలు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తుంది.
గత ప్రభుత్వం ఇచ్చిన తరహాలో...
గత ప్రభుత్వం రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టింది. ఎకరాకు పది వేల రూపాయలు చెల్లించింది. భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ రైతు బంధు పథకాన్ని చెల్లించింది. రెండు సీజన్ లలో విడివిడిగా రైతు బంధు పథకాన్ని అందచేసేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం దాదాపు 7,300 కోట్ల రూపాయలను కూడా ఒక్కొక్క విడతకు కేటాయించింది. దీంతో రైతులు పంటలు వేసుకోవడానికి, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడానికి ఈ నిధులను వినియోగించే వారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత వరకూ రైతు బంధు పథకాన్ని అమలు చేయలేదు. వంద ఎకరాలున్న వారికి కూడా రైతు బంధు ఎలా ఇస్తామన్న ప్రశ్న పాలకుల నుంచే వినిపించాయి.
తాజా నిర్ణయం ప్రకారం...
అయితే తాజాగా నిర్ణయించిన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయపు పన్ను చెల్లించే వారికి మాత్రం రైతు బంధు పథకాన్ని వర్తింప చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీజన్ కు 7,500 రూపాయల జమ చేయాల్సి ఉండగా ఈ నిబంధనలను అమలులోకి తెచ్చినట్లు తెలిసింది. మంత్రి వర్గ ఉప సంఘం కూడా ఇదే రకమైన ప్రతిపాదనను సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఈ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించినట్లు తెలిసింది. త్వరలోనే దీనిని అసెంబ్లీలో ప్రవేశపెడతారని కూడా చెబుతున్నారు. అసెంబ్లీలో చర్చించి మరికొన్ని విధివిధానాలతో రైతు బంధు పథకాన్ని కూడా అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమయింది.
Next Story

