తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్
తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలను గత బుధవారం విడులైన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ ..
![high court, bhoomi puja, trafic restrictions, telangana, Telangana High Court Bhoomi pooja high court, bhoomi puja, trafic restrictions, telangana, Telangana High Court Bhoomi pooja](https://www.telugupost.com/h-upload/2023/10/10/1549567-ts-high-court.webp)
తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలను గత బుధవారం విడులైన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్ట్ బ్రేక్ వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ కొత్త నియామకాలకు బ్రేక్ పడినట్లయ్యింది. 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడాన్ని కానిస్టేబుల్ నియామక బోర్డును హైకోర్టు తప్పుబట్టింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో తాము నష్టపోయినట్లు పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మెయిన్స్ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి.. తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలంటూ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కు కోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉండగా, పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గతేడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే ఏడాది ఆగస్టు 30న పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షల్లో 4,965 అభ్యర్థులు పరీక్షలు రాశారు. అయితే, ఇందులో 3 ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో పాటు ఒక ప్రశ్న తప్పుగా ఇవ్వడంతో సమాధానాలు రాయలేకపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్ వరకు చదువుకున్న అభ్యర్థులు.. ఇంగ్లీషులో ప్రశ్నలుండటంతో కొంత గందరగోళానికి గురై సమాధానం రాయలేకపోయారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.