Sat May 24 2025 14:00:16 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ.. సహకరించరూ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవాలు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచుతున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవాలు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచుతున్నారు. ఒకరకంగా ప్రజలకు ఉన్న పరిస్థితి చెప్పి తాను ఏం చేయాలో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తీలు కట్టడానికే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని అన్నారు. జీతభత్యాలు చెల్లించాలి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పింఛను చెల్లించాలి. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించి వెళ్లిందని, తాము వాటిని సెట్ చేయడం సవాల్ గా మారిందని చెబుతూనే మరొక వైపు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలా? వద్దా? అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి తనను ఎంత మాత్రం ముందుకు అడుగు కూడా పడనివ్వడం లేదన్నారు.
కాళ్లకు అడ్డంపడే వారు.
దీంతో పాటు ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలంటే సంక్లిష్టంగానే మారింది. ఇక్కడ కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటంతో సహకారం అందడంలోనూ అనుమానమే. అనుమానమే కాదు.. ఎలాంటి సాయం రాదు. మరొక వైపు భూములు విక్రయించి పథకాలను అమలు చేయడంతో పాటు ప్రధాన సమస్యలను తీర్చాలన్నా కాళ్లకు అడ్డం పడే వారు ఎక్కువయ్యారు. బీఆర్ఎస్ కోరుకునేది అదే. కేసీఆర్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కాంగ్రెస్ ఫెయిల్.. ఫెయిల్ అంటూ చేసిన నినాదం వెనక ఇదేనని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఫెయిల్ అనే ముద్ర వేయడానికి కారు పార్టీ ప్రయత్నం చేస్తుంది. ప్రజలు కూడా దానిని విశ్వసించే అవకాశముంది.
సంక్షేమ పథకాలను ...
అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. మరొక వైపు సంక్షేమ పథకాలు ఏవీ ఆపడం లేదు. పైగా సన్న బియ్యం వంటి పథకాలను కూడా ప్రవేశపెట్టి మరింత ఆర్థిక భారాన్ని ఖజానాపై మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సహజంగా ఉద్యోగులు తమ డిమాండ్లను కూడా నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే ఆర్టీసీ కార్మికుల సమ్మె కు నోటీసులు ఇచ్చారు. వారు విరమించుకున్నా తాత్కాలిక వాయిదాననే ప్రకటించారుక. భవిష్యత్ లో ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళనకు దిగే అవకాశముంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మిగిలిన హామీలను కూడా అమలు చేయాలని విపక్ష పార్టీల నుంచి వత్తిడి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా రేవంత్ రెడ్డి ప్రజలతో పాటు వివిధ ఉద్యోగ సంఘాలకు కూడా వాస్తవ పరిస్థితులను చెబుతున్నారు. మరి ప్రజలు ఏ రకంగా దీనిని స్వీకరిస్తారన్నది చూడాలి.
Next Story