Thu Apr 25 2024 15:03:12 GMT+0000 (Coordinated Universal Time)
తలకు రుమాలు కట్టి వేషాలు.. మోదీపై కేసీఆర్ ఫైర్
ప్రధాని మనకు శత్రువుగా మారాడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వికారాబాద్ సభలో కేసీఆర్ మాట్లాడారు
ప్రధాని మనకు శత్రువుగా మారాడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వికారాబాద్ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఆగస్టు 15 సందర్భంగా మోదీ ప్రసంగలో ఏమీ లేదన్నారు. నెత్తికి రుమాల్ కట్టి వేషం తప్ప ఏముందని కేసీఆర్ ప్రశ్నించారు. నిన్న గంట మాట్లాడితే అంతా గ్యాసేనని అన్నారు. డైలాగులు తప్ప దేశానికి పనికి వచ్చే ఒక్క మంచి మాట అయినా ఉందా? అని కేసీఆర్ నిలదీశారు. బీజేపీ జెండా పట్టుకుని తన బస్సునే అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఈ ప్రభుత్వం పోయి రాష్ట్ర హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలని ఆయన ఆకాంక్షించారు. దుష్ట శక్తులకు గుణపాఠం చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఉచితాలను రద్దు ....
తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. పొరుగున ఉన్న రాష్ట్రాలకంటే ఇక్కడే భూముల ధరలు అధికంగా ఉన్నాయన్నారు. ఒక్క ఎకరం భూమి ఇక్కడ అమ్మితే అక్కడ మూడు ఎకరాలు కొనుగోలు చేయవచ్చన్నారు. వికారాబాద్ కు మెడికల్, డిగ్రీ కళాశాలలను మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం వద్దంటుందన్నారు. ఉచితాలను రద్దు చేయడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. చివరకు ఉచిత కరెంట్ కూడా ఇవ్వవద్దంటుందని అన్నారు.
మీటర్లు పెట్టి...
వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు పెట్టాలన్న యోచనలో ఉందని, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ హెచ్చరించారు. ఈ ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. గ్యాస్, పెట్రోలు ధరలు విపరీతంగా పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచేలా నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మండి పడ్డారు. కేంద్రం కృష్టా నీటి వాటా తేల్చడం లేదన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పధకం ఆలస్యం కావడానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఆయన అన్నారు.
Next Story