Thu Mar 19 2026 15:02:01 GMT+0530 (India Standard Time)
30 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో ముందే ఊహిస్తా
ఈ వయసులో కూడా తాను టీనేజర్స్ ఆలోచించినట్లు ఆలోచిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

ఈ వయసులో కూడా తాను టీనేజర్స్ ఆలోచించినట్లు ఆలోచిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. 25 ఏళ్ల ముందే తాను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్ బయోటెక్నాలజీదేనని ఆరోజే తాను చెప్పానని అన్నారు. కరోనా వ్యాక్సిన్ ను కనిపెట్టారంటే అది తాను స్థాపించిన జినోమ్ వ్యాలీ వల్లనే సాధ్యమయిందని చంద్రబాబు అన్నారు. తాను 30 సంవత్సరాలకు జరగబోయేది ముందే ఊహించగలనని చెప్పారు.
టీనేజర్ల్ ఆలోచనల మాదిరిగానే...
కరోనా వ్యాక్సిన్ రావడానికి దోహదం చేసింది టీడీపీయేనని అన్నారు. నేషనల్ హైవే ఆలోచన కూడా తనదేనని అన్నారు. తడ నుంచి నెల్లూరు వరకూ తొలుత నిర్మించామని తెలిపారు. సంపద సృష్టించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి తాను పనిచేశానని తెలిపారు. అదే సమయంలో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందచేయాలన్నారు. ఐటీలో తెలుగు యువతకు ఉన్న శక్తి మరెవ్వరికీ లేదన్నారు.
టీడీపీ ఎక్కడ అనేవారికి...
బీసీలకు టీడీపీ అధిక ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. కంపెనీలను తేవడం కోసం ప్రపంచమంతా తిరిగానని చంద్రబాబు అన్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్ కు తెచ్చింది తానేనని అన్నారు. ఐఎస్బిని ఏర్పాటు చేసి హైదరాబాద్ కు మరింత వన్నె తెచ్చామన్నారు. బడుగు బలహీన వర్గాలకు సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని కల్పించింది టీడీపీయేనని అన్నారు. తెలంగాణలో టీడీపీ అవసరం ఉందా? లేదా? అని ప్రజలను ఆయన ప్రశ్నించారు. భద్రాచలానికి వరదలు రాకుండా నాడే కరకట్టను నిర్మించామని, అదే టీడీపీ దూరదృష్టి అని ఆయన అన్నారు. టీడీపీ తెలంగాణలోనూ బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ ఎక్కడ అని అడిగేవారికి ఖమ్మం సభ సమాధానమన్నారు.
Next Story

