Thu Dec 18 2025 07:29:53 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ సస్పెండ్
తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.

తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇచ్చిన జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు పంపింది. శ్రీనివాస్ గౌడ్ కేసులో తమపై కేసుల నమోదుకు కోర్టు ఆదేశించడంతో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగబద్దంగా ఏర్పడ్డ వ్యవస్థలపై ఎలా కేసులకు ఆదేశిస్తారని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసంది. రాజ్యాంగ వ్యవస్థలపై కేసులు నమోదుకు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసి, జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
2018 ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ తో పాటు అఫిడవిట్ ను సమర్పించారు. వాటిని ఈసీ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసింది. తర్వాత ఆ అఫిడవిట్ మారిపోయిందని, పాతది డిలీట్ చేసి కొత్తది అప్ లోడ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ట్యాంపరింగ్ జరగడంపై ఫిర్యాదు చేస్తూ మహబూబ్నగర్ జిల్లాకే చెందిన చలువగాలి రాఘవేంద్ర రాజు హైదరాబాద్ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు వచ్చినా మహబూబ్ నగర్ పోలీసులు మొదట కేసులు నమోదు చేయలేదు. కోర్టు ఆదేశించినప్పటికీ కేసు నమోదు చేయలేదని ఇటీవల పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కేసు నమోదు చేయకపోతే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని మహబూబ్ నగర్ పోలీసులను జడ్జి హెచ్చరించారు. కోర్టు హెచ్చరికలతో మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీసులు స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో 10 మంది అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది సుప్రీంకోర్టుకు చేరడంతో జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేసింది.
Next Story

