Thu Mar 19 2026 22:59:42 GMT+0530 (India Standard Time)
Telangana : పరిమితికి మించి ఖర్చు పెడితే.. అనర్హత వేటు
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేయగల గరిష్ట పరిమితిని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది

తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేయగల గరిష్ట పరిమితిని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిర్ణయించిన పరిమితిని మించి ఖర్చు చేసినా, నలభై ఐదు రోజుల్లోగా ఖర్చు లెక్కలు సమర్పించకపోయినా, ఆ అభ్యర్థికి మూడు సంవత్సరాలపాటు పంచాయతీ రాజ్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదని హెచ్చరించింది. ఎన్నికైన వారైనా నిబంధనలు పాటించకపోతే పదవి కోల్పోయే ప్రమాదం ఉందని, పంచాయతీ రాజ్ చట్టం–2018లోని 238వ సెక్షన్ ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
గరిష్టంగా ఖర్చు...
జెడ్పీటీసీ అభ్యర్థులు గరిష్టంగా నాలుగు లక్షల రూపాయలు, ఎంపీటీసీ అభ్యర్థులు 1.5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఏ అభ్యర్థి తరఫున ఆ నియోజకవర్గంలో రాజకీయ పార్టీ ఖర్చు చేసినా, అది అభ్యర్థి ఖర్చుగా పరిగణిస్తారు. అయితే, పార్టీ సాధారణ ప్రచారానికి చేసిన సామూహిక ఖర్చులు అభ్యర్థుల లెక్కల్లో చూపనవసరం లేదని స్పష్టం చేసింది.
జెడ్పీటీసీ అభ్యర్థులకు రూ.4 లక్షలు
ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.1.5 లక్షలు
Next Story

