Sun Dec 14 2025 06:45:52 GMT+0000 (Coordinated Universal Time)
Telangana: నేడు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో నేడు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.

తెలంగాణలో నేడు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు మధ్యాహ్నం రెండు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఓటర్లు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఓటరు ఐడీ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిన్న రాత్రి తమ గ్రామాలకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
భారీ పోలీసు బందోబస్తు మధ్య...
రెండో దశలో 3,911 పంచాయతీ సర్పంచ్ పదవులకు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల వద్ద అదనపు పోలీసు బలగాలను దించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల వద్ద 144 సెక్షన్ విధించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది. మొదటి దశలో జరిగినట్లుగానే ప్రశాంతంగా పోలింగ్, కౌంటింగ్ జరిగేలా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.
Next Story

