Tue Feb 18 2025 13:52:00 GMT+0000 (Coordinated Universal Time)
అవయవదానం: ఏడుగురి ప్రాణాలు కాపాడిన సంగారెడ్డి యువకుడు
సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ కు చెందిన యువకుడు చనిపోతూ తన అవయవాలు దానం చేసి

సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ కు చెందిన యువకుడు చనిపోతూ తన అవయవాలు దానం చేసి ఏడుగురి ప్రాణాలు నిలబెట్టాడు. సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ కి చెందిన యువకుడు, భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేత గొల్ల పెంటన్న ఇటీవల రోడ్డు ప్రమాదం తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా పెంటన్న అవయవాలు దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.
బుధవారం రాత్రి పెంటన్న తన బంధువుల ఇంటికి వెళ్లి బైక్ పై తిరిగి వస్తున్న క్రమంలో నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ క్రాసింగ్ వద్ద ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం అతడ్ని ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అతనిని నారాయణఖేడ్ హాస్పిటల్లో ప్రథమ చికిత్స చేసిన తర్వాత సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి.. అక్కడి నుండి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు ప్రకటించడంతో జీవన్ దాన్ ట్రస్ట్ పెంటన్న కుటుంబ సభ్యులకు అవయవదానం ప్రాధాన్యాన్ని వివరించింది. శుక్రవారం తెల్లవారుజామున మరణించడంతో అతడి అవయవాలను ఏడుగురికి అందించారు. శనివారం సిర్గాపూర్ లో పెంటన్న అంత్యక్రియలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులూ, కార్యకర్తలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.పెంటన్నకు భార్య లావణ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Next Story