Sat Mar 07 2026 17:43:25 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ మంత్రివర్గంలోనే షిండేలు
కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్నది మొత్తం ఏక్ నాథ్ షిండేలనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్నది మొత్తం ఏక్ నాథ్ షిండేలనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇతర పార్టీల నుంచి కొనుగోలు చేసి తెచ్చి పెట్టుకున్నావన్నారు. నిన్న కేసీఆర్ ఏకపాత్రాభినయం చూశామని చెప్పారు. నీ పార్టీ కాని వాళ్లను మంత్రిని చేసింది నువ్వు కాదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నీ దాకా వస్తేగాని తెలియదా? అని ఎద్దేవా చేశారు. మంత్రి వర్గంలో నీ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్లు ఎవరున్నారు అని రేవంత్ రెడ్డి నిలదీశారు. మోదీ దుర్మార్గుడే.. ఆ దుర్మార్గుడికి ఎన్ని సార్లు మద్దతిచ్చావని, రైతుచట్టాలు, గత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు.
ముందస్తు ఎన్నికలు...
కేసీఆర్ కు ఎవరైనా పాఠం చెప్పారో తెలియదు కాని కాంగ్రెస్ మీద కూడా నిందలు వేశారన్నారు. కాంగ్రెస్ తన పాలనలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసిందన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలోనే ఉన్నారన్నారు. ఎన్నికలకు వెళుతుంటే మరొక పార్టీ తేదీ చెప్పడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో గెలవలేమన్న భయం పట్టుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈసారి ముందస్తు, వెనకస్తు వెళ్లినా కేసీఆర్ ఓటమి ఖాయమని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.
Next Story

