Sat Dec 06 2025 03:13:36 GMT+0000 (Coordinated Universal Time)
అధికారంలోకి రాగానే కేసులన్నీ మాఫీ
అగ్నిపథ్ పథకాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.

అగ్నిపథ్ పథకాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. మూడు నెలల్లో సైనికులకు శిక్షణ ఏం ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అగ్నిపథ్ ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అలర్ల కేసులో జైలులో ఉన్న పిల్లల కుటుంబాలకు కాంగ్రెస్ అండగా నిలబడుతుందన్నారు. వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని రేవంత్ కోరారు. వారికి న్యాయపరమైన అంశాలతో పాటు పూచికత్తు విషయంలో కూడా కాంగ్రెస్ చొరవ తీసుకుంటుందని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నిర్ణయాలు ఉంటాయని రేవంత్ రెడ్డి చెప్పారు.
నియంతల్లాగా....
కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. లక్షల మంది యువత భవిష్యత్ ను కాల రాస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసులన్నింటినీ మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కోట్లాది యువకులకు అండగా కాంగ్రెస్ నిలబడుతుందన్నారు. సమస్యలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇస్తుందన్నారు. రాహుల్ గాంధీని ఐదు రోజులు విచారించిందన్నారు. సోనియా గాంధీ ఈడీ ఆఫీసులో కాలు పెట్టిన మరుక్షణం ఈ ప్రభుత్వం పతనమవుతుందని, దుర్మార్గమైన ఆలోచనలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. మోదీ ప్రభుత్వానికి ఎవరూ భయపడబోరన్నారు.
Next Story

