Thu Jan 29 2026 17:19:21 GMT+0000 (Coordinated Universal Time)
సురవరం పార్ధీవ దేహానికి నివాళులర్పించిన రేవంత్ రెడ్డి
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పార్ధీవ దేహం మఖ్దూం భవన్ కు తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు

సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పార్ధీవ దేహం మఖ్దూం భవన్ కు తరలించారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్ధం ఉంచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మఖ్దుం భవన్ కు వచ్చి సుధాకర్ రెడ్డి పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. రాజీపడని సిద్ధాంతాలతో ఆయన ప్రస్థానం కొనసాగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐఎస్ఎఫ్ నుంచి జాతీయ కార్యదర్శిగా ఎదిగిన సుధాకర్ రెడ్డి మరణం బాధించిందని తెలిపారు.
ఏరోజూ సిద్ధాంతాలను పక్కనపెట్టకుండా...
సుధాకర్ రెడ్డి సూచన మేరకు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు. పాలమూరు బిడ్డగా ఆయన జాతీయ స్థాయికి ఎదిగినప్పటికీ అణుకువగా ఉంటూ ప్రజల మన్ననలను పొందుతూ ఏరోజూ సిద్ధాంతాలను పక్కన పెట్టలేదన్నారు. ప్రభుత్వ పక్షాన అధికారిక లాంఛనాలతో జరపాలని నిర్ణయించామని తెలిపారు. అటువంటి సుధాకర్ రెడ్డి మరణం యావత్ తెలంగాణ ప్రజలకు తీరని లోటని రేవంత్ రెడ్డి చెప్పారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
Next Story

