Tue Jan 20 2026 18:31:04 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ భ్రష్టుపట్టడానికి పల్లాయే కారణం : కడియం శ్రీహరి
పల్లా రాజేశ్వర్రెడ్డి కారణంగానే పార్టీ భ్రష్టు పట్టిపోయిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు

పల్లా రాజేశ్వర్రెడ్డి కారణంగానే పార్టీ భ్రష్టు పట్టిపోయిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చెవిలో దూరి తప్పుడు సమాచారం ఇస్తూ, ఇతరులపై లేనిపోని చాడీలు చెప్పి నేతలను కేసీఆర్ కు దూరం చేశారని కడియం శ్రీహరి అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి వల్లనే పార్టీ ఓడిపోయిందని కూడా అన్నారు. ఇదే అభిప్రాయం తనలో మాత్రమే కాదని అనేక మంది నేతల్లో ఉందని, కావాలంటే ఎవరైనా ఆయన వ్యవహారశైలిపై అంతర్గతంగా నేతలను విచారించవచ్చని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారానని అన్నారు.
ఎర్రబెల్లి మానుకో...
ఎర్రబెల్లి దయాకర్ రావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఓటమి పాలయిన ఎర్రబెల్లి దయాకర్ రావు తనను విమర్శించే స్థాయిలేదన్నారు. తన నిజాయితీ అందరికీ తెలుసునని అన్నారు. ఎందరో పార్టీలు మారినా తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల అందరి చరిత్ర తన వద్ద ఉందని, తనకు ఒక్క రూపాయి బీఆర్ఎస్ ఇచ్చినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పిలుపు మేరకే ఆ పార్టీలో చేరామన్నారు.
Next Story

