Thu Dec 18 2025 17:53:47 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో మినరల్ వాటర్ వ్యాపారం కోట్లలోనే
మునుగోడులో కోట్ల రూపాయల మినరల్ వాటర్ బాటిల్స్ వ్యాపారం జరుగుతుంది

మునుగోడులో కోట్ల రూపాయల మినరల్ వాటర్ బాటిల్స్ వ్యాపారం జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారు. వివిధ రోడ్ షోలకు, ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పార్టీల కార్యకర్తలు మునుగోడు చేరుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక సభలకు, సమావేశాలకు కూడా ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను సమీకరిస్తున్నాయి పార్టీలు. ఎండ దెబ్బకు దాహంతో మంచినీళ్ల బాటిళ్లను కార్యకర్తలు ఆశ్రయిస్తున్నారు. నేతలు తమ వాహనాల్లో ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నా, కార్యకర్తలు మాత్రం బాటిళ్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది.
లక్షల సంఖ్యలో...
ఈ నేేపథ్యంలో మునుగోడులో మినరల్ వాటర్ బాటిల్స్ కు గిరాకి పెరిగింది. రోజుకు లక్షల సంఖ్యలో లీటర్ వాటర్ బాటిల్స్ అమ్ముడవుతున్నాయి. చిన్న దుకాణాల్లోనూ మునుగోడులో మినరల్ వాటర్ బాటిల్స్ ను అమ్ముతున్నారు. ప్లోరైడ్ ప్రభావిత ప్రాంతం కావడంతో అక్కడ మంచినీరు తాగేందుకు ఎవరూ ఇష్టపడకపోవడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో విక్రయించిన దానికంటే ఆరు రెట్లకు మించి విక్రయాలను జరుపుతున్నట్లు వ్యాపారాలు చెబుతున్నారు.
మరికొన్ని రోజులు....
ధరలు పెంచకపోయినప్పటికీ మినరల్ వాటర్ బాటిల్స్ అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. ఒక్క మినరల్ వాటర్ ద్వారానే కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతుంది. చిరు వ్యాపారులు కూడా గతంలో ఆర్డర్ ఇచ్చిన దానికంటే అధికంగా తెప్పించుకుని స్టాక్ ఉంచుకుంటున్నారు. నవంబరు 1వ తేదీ వరకూ ప్రచారం ఉండటంతో అప్పటి వరకూ ఈ నీళ్ల బాటిళ్లకు డిమాండ్ అధికంగా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.
Next Story

