Sun Dec 14 2025 11:45:25 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : మూడు రోజులు పాటు వర్షాలేనట...ఉక్కపోతతో అవస్థలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపిదంి. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారంగా, నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు పడతాయని పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే అతి భారీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం మాత్రం లేదని, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
ఇదే సమయంలో రెండు రాష్ట్రాల్లో ఉక్కపోత పెరుగుతుందని కూడా పేర్కొంది. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గినా ఉక్కపోత పెరగడంతో మళ్లీ ఏసీల వాడకం పెరిగింది. దీంతో విద్యుత్తు వినియోగం రెండు రాష్ట్రాల్లో మరింత పెరిగింది. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోనూ ఉదయం ఎనిమిది గంటల వరకూ చలిగాలులు వీస్తున్నప్పటికీ, పది గంటల నుంచి ఉక్కపోత ప్రారంభం అవుతుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.
బలమైన ఈదురుగాలులతో...
ఆంధ్రప్రదేశ్ లోనూ మరో మూడు రోజుల పాటు వానలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పదిహేను రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం వర్షాలు కురవడం లేదు. ఉత్తరకోస్తాలో మోస్తరు నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిఖ కోస్తా ప్రాంతంలోనూ ఇదే పరిస్థితిలో వర్షాలు పడతాయని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో మాత్రం తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ వావాతావరణ కేంద్రం పేర్కొంది. గోదావరికి వరద తగ్గిందని కూడా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
Next Story

