Mon May 06 2024 16:04:07 GMT+0000 (Coordinated Universal Time)
మరో మూడు రోజులు ఎండలే
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఉదయం ఎనిమిది గంటల నుంచి బయటకు వచ్చేందుకు భయపడి పోతున్నారు. పది గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
అత్యధిక ఉష్ణోగ్రతలు...
ఇక తాజాగా నిర్మల్ జిల్లాలో ఎండలు మరింత మండిపోతున్నాయి. జిల్లాలోని దస్తూరాబాద్ మండలంలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే వడదెబ్బ తగులుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే అసిఫాబాద్ జిల్లాలోని జంబుగ, నల్లగొండ జిల్లా కట్టంగూరులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Next Story