Sat Dec 06 2025 02:14:31 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : మరో మూడు రోజులు భారీ వర్షాలు.. అలెర్ట్ చేసిన వాతావరణ శాఖ
మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. పగటి పూట భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయని అన్నారు. కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
మోస్తరు నుంచి తేలికపాటి...
ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా లో ఈరోజు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో వర్షాలు మోస్తరుగా పడతాయని, కొన్ని చోట్ల పిడుగు పడే అవకాశముందని కూడా హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశముందని చెప్పింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎల్లో అలెర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఇంకా మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని తెలిపింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబబాబాద్, వరంగల్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Next Story

