పునరుద్ధరణకు సిద్ధం లక్ష్మీపురం–రుద్రారం త్రికూట శివాలయం
కాకతీయుల కాలం నాటి శిధిల దేవాలయానికి పునర్వైభవం లక్ష్యం

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపురం–రుద్రారం గ్రామాల శివారులో చెరువు సమీపంలో ఉన్న కాకతీయుల కాలం నాటి సా.శ. 13వ శతాబ్దపు త్రికూట శివాలయ పునరుద్ధరణపై సమావేశం బుధవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
ఆలయ పునరుద్ధరణ కమిటీ ఆహ్వానం మేరకు ఆయన శిధిలావస్థలో ఉన్న శివాలయాన్ని సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో ఆలయ చరిత్రను వివరించారు.
కాకతీయ గణపతిదేవుని కాలంలో ఈ త్రికూటాలయం నిర్మించినట్లు తెలిపారు. మూడు ఆలయాల్లో రెండు పూర్తిగా శిధిలమయ్యాయని, ప్రధానాలయం మాత్రమే ప్రస్తుతం నిలిచివుందని చెప్పారు. మిగిలిన రెండు ఆలయాలు, రంగమండపం పునాదుల వరకు మాత్రమే కనిపిస్తున్నాయని వివరించారు.
ఆలయ ప్రాంగణంలో కాకతీయుల కాలానికి చెందిన శివలింగం, రెండు వీరభద్ర విగ్రహాలు, ఒక సూర్యుని విగ్రహం, ఒక వీరుని శిల్పం ఉన్నాయని తెలిపారు.
గ్రామ పెద్దలు, లక్ష్మీపురం సర్పంచ్ ఆవుల మల్లారెడ్డి, ఎ. చంద్రారెడ్డి, నామిరెడ్డి రామిరెడ్డి, కాకునూరు శ్రీనివాస్, ఆవుల బక్కారెడ్డి, దేవేందర్ రెడ్డి, మట్టపల్లి శేఖర్, శ్రీను, పార్వతమ్మ, సైదమ్మ, చిట్యాల రమేష్, పాతపాటి వెంకటయ్య, మునగాల వెంకట్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశంలో శిధిల శివాలయాన్ని పదిలపరచి పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించారు.
దీనికి అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని శివనాగిరెడ్డిని కోరారు. కార్యక్రమంలో శిల్పి దూడల నిఖిల్, గ్రామస్తులు పాల్గొన్నారు.

