Wed Feb 04 2026 23:21:47 GMT+0000 (Coordinated Universal Time)
స్వేదపత్రం విడుదల రేపటికి వాయిదా
బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల రేపటికి వాయిదా పడింది

బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల రేపటికి వాయిదా పడింది. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసింది. దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము 'స్వేదపత్రం' విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే వివిధ కారణాల వల్ల ఇది రేపటికి వాయిదా పడినట్లు పార్టీ వెల్లడించింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో కేటీఆర్ బీఆర్ఎస్ స్వేదపత్రాన్ని విడుదల చేయనున్నారు. కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని ఇంతకు ముందు కేటీఆర్ తెలిపారు. రాత్రిపగలూ తేడా లేకుండా కష్టపడి చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహింబోమని, విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమన్నారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోబోమని గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను స్వేదపత్రం ప్రజంటేషన్లో వివరిస్తామన్నారు.
‘తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలూ రాత్రి తేడా లేకుండా రెకల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించం. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు.. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిషరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు స్వేద పత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది’ అని అంతకు ముందు ట్వీట్ చేశారు. అయితే ఈ కార్యక్రమం ఈరోజు జరగలేదు.. ఆదివారం నాటికి వాయిదా వేశారు.
Next Story
