Tue Mar 03 2026 12:38:29 GMT+0530 (India Standard Time)
Summer Effect : సమ్మర్ మీటర్ పెరుగుతోంది...అప్పుడే 38 డిగ్రీలు దాటేసిందిగా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని చోట్ల ఉదయం వేళ పొగమంచు కనిపిస్తుంది. గన్నవరం ఎయిర్ పోర్టులో పొగమంచు ప్రభావంతో ఉదయం పూట విమానాల ల్యాండింగ్ కూడా కష్టంగా మారింది. మరొకవైపు మిగిలిన చోట్ల మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం వేళ కొంత చలి కనిపిస్తున్నప్పటికీ ఉదయం 9 గంటల నుంచి ఎండల తీవత్ర ఎక్కువగా కనిపిస్తుంది.
ఇప్పుడే ఇంత స్థాయిలోనా?
ఆంధ్రప్రదేశ్ లో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతపురంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతపురం జిల్లాలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తిరుపతి, కర్నూలు, కడప, నంద్యాల, కావలి, అమరావతి ప్రాంతాల్లోనూ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయని అధికారులు వెల్లడించారు. మార్చి ఆరంభంలోనే ఇలా ఉంటే ఇక ఈ ఏడాది యాభై డిగ్రీలు నమోదవుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిసింది.
తెలంగాణలో వేడిగాలులు...
ఇక తెలంగాణలోనూ గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పగటి వేళ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు అంటున్నారు. ఇక తెలంగాణలో వడగాలుల తీవ్రత కూడా ఈసారి ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ నుంచి మరింత ఉష్ణోగ్రతలు పెరిగిన మే నెలలో అవి తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా ఈసారి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఈ ఏడాది ఎక్కువగా ఉంటుందని, అందుకనే పగటి వేళ అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు పగటి వేళ బయటకు రావద్దని కోరుతున్నారు.
Next Story

