Thu Mar 19 2026 05:28:49 GMT+0530 (India Standard Time)
Weather Report : చలి తగ్గినా.. పొగమంచు వదలలేదే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొంత తగ్గింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొంత తగ్గింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కనపడుతున్నాయి. ఉక్కపోత కూడా మొదలయింది. పొగమంచు తీవ్రత కూడా ఇంకా తగ్గలేదు. ఉదయం వేళ తొమ్మిది గంటల వరకూ పొగమంచు కమ్ముకుంటోంది. వాహనదారులు ఉదయం వేళ కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఇక రానున్న కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
పొగమంచుతో...
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చలి తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకున్నాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఇంకా కొంత చలితీవ్రత ఏజెన్సీ ప్రాంతంలో కనిపిస్తుందని, మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ అధికారుల అంచనా మేరకు మరో రెండు రోజులు మాత్రమే చలి కొంత ఉంటుందని, తర్వాత మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. మరొకవైపు సీజన్ ఒక్కసారిగా మారడంతో గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశముందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
కొంత తగ్గినా...
తెలంగాణలోనూ చలి తీవ్రత చాలా వరకూ తగ్గింది. ఉదయం వేళ కాసేపు, తెల్లవారు జామున మాత్రమే చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక నిన్న మొన్నటి వరకూ ఆదిలాబాద్ వంటి ప్రాంతంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే నేడు ఆ జిల్లాలోనూ డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నేడు పొడి వాతావరణం ఉంటుందని, వాతావరణ మార్పులతో కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Next Story

