ఆ పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి 'మసే' : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూనే ఉన్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో ఉచిత మంచినీటి పథకం విషయంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్ వాసులకు కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసేనని వ్యాఖ్యానించారు. 20 నెలలు కావస్తున్నా.. ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేక ఇప్పటికే చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి మహాపాపాన్ని మూటగట్టుకున్నారు.. బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలకు కూడా ఉరివేస్తే.. మహానగరంలోని కోటి 20 లక్షల మంది ప్రజలు చరిత్రలో కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ ను క్షమించరు అన్నారు.
రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట.. ఇప్పటికే హైడ్రా వంటి దిక్కుమాలిన నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసి తీరని నష్టాన్ని కలిగించారు.. బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానంలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేని రాజధాని వాసులకు మళ్లీ కరెంట్ కష్టాలను పరిచయం చేసిన పాపం రేవంత్ దేనన్నారు. ఓవైపు అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, ఇంకోవైపు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతుంటే.. ఫ్రీ వాటర్ స్కీమ్ ను కూడా గండికొట్టాలని చూస్తున్న రేవంత్ కు కర్రు గాల్చి పెట్టేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు.

