Thu Mar 19 2026 18:24:38 GMT+0530 (India Standard Time)
Telangana : అహంకారాన్ని.. నియంతృత్వాన్ని జనం సహించరు
తెలంగాణ గవర్నర్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు.

తెలంగాణ గవర్నర్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా వెళితే ప్రజలు ఊరుకోరు అని అన్నారు. గత పదేళ్లలో అలాగే ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వం బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. నియంతృత్వ వైఖరిని తెలంగాణ సమాజం సహించదన్న తమిళి సై ఎన్నికల్లో ఈ విషయాన్ని స్పష్టమైన తీర్పు ద్వారా ప్రకటించారు. అహంకారం, నియంతృత్వం ఎక్కువ కాలం చెల్లదని చాటి చెప్పారన్నారు. అయితే గత పదేళ్లుగా విధ్వంసమైన తెలంగాణను పునర్నించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
పేదల కుటుంబాల్లో వెలుగులు...
అన్ని వర్గాల ఆకాంక్షల మేరకే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ప్రజల ముఖాల్లో ఆనందం చూడటమే ఈ ప్రభుత్వ ఉద్దేశ్యమని, వారి కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ తెలిపారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేశామన్న గవర్నర్ మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేస్తామని తెలిపారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాల కల్పనతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. రెండు లక్షల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
Next Story

