Fri Mar 20 2026 16:45:40 GMT+0530 (India Standard Time)
బస్సు లో బంగారం.. కండక్టర్ గొప్ప మనసు
ఓ మహిళా ప్రయాణికురాలు రూ. 8 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగును

జగిత్యాల జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బస్సులో బంగారాన్ని ఓ మహిళ మర్చిపోగా.. ఆ బంగారాన్ని ఆమెకు తిరిగి దక్కేలా చేశారు. బంగారం పోయిందని బాధపడిన మహిళ మోములో ఆనందం కనిపించింది. ఓ మహిళా ప్రయాణికురాలు రూ. 8 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగును గమనించిన ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రయాణికురాలికి తిరిగి అప్పగించింది.
శనివారం రాత్రి పెద్దపల్లి నుంచి జగిత్యాల వెళ్లే ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికురాలు ప్రయాణించింది. జగిత్యాల రాగానే ఆమె తన బ్యాగ్ను బస్సులోనే మరచి దిగిపోయింది. బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ను మహిళా కండక్టర్ గమనించింది. ఆ బ్యాగులో ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా ప్రయాణికురాలికి సమాచారం అందించింది. జగిత్యాల డిపో మేనేజర్ సమక్షంలో బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ను బాధిత ప్రయాణికురాలికి అప్పగించారు. కండక్టర్ వాణి నిజాయితీని డిపో మేనేజర్ అభినందించారు. ప్రయాణికురాలు భవానీ మాట్లాడుతూ.. నగలు దొరకక పోయి ఉంటే దసరా పండుగ కన్నీళ్ళతో గడిచేదని అన్నారు. నిజాయితీగా తన బంగారు ఆభరణాలను అందించిన కండక్టర్ వాణికి, డ్రైవర్ తిరుపతికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Next Story

