Fri Dec 05 2025 12:40:34 GMT+0000 (Coordinated Universal Time)
గోదావరి ఉధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి నది ఉధృతి కొనసాగుతుంది. భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం 48 అడుగులకు చేరుకుంది

గోదావరి నది ఉధృతి కొనసాగుతుంది. భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం 48 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రజలను హెచ్చరించారు. ప్రధానంగా ముంపు మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలపడంతో గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశముంది. దీంతో అధికారులు అప్రమత్తమై అన్ని చర్యలు చేపట్టారు.
కోనసీమలోనూ...
మరోవైపు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. బ్యారేజీ నుంచి ప్రస్తుతం 3.69 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కొన్ని గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసిన అధికారులు వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

