ఇథనాల్ పరిశ్రమ వద్దన్న రైతులకు సంకెళ్లు.. పోలీసులు సస్పెండ్
ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ ఆందోళనలు చేపట్టిన కేసులో రిమాండ్లో ఉన్న రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లారు.

ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ ఆందోళనలు చేపట్టిన కేసులో రిమాండ్లో ఉన్న రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లారు. గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ వద్ద ఏర్పాటు చేయనున్న ఇథనాల్ కంపెనీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జూన్ 4న పెద్దధన్వాడతో పాటు పరిసర గ్రామాల రైతులు ఆందోళన చేశారు.
ఈ సంఘటనపై పోలీసులు 41 మంది రైతులపై కేసులు పెట్టారు. వారిలో 12 మందిని రిమాండ్కు తరలించారు. రిమాండ్లో ఉన్న రైతులను మహబూబ్నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టులో హాజరుపరిచేందుకు రాగా ఇద్దరిద్దరికి కలిపి సంకెళ్లు వేశారు. రైతులతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా న్యాయమూర్తి ప్రేమలత షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేయడంతో రైతులను విడుదల చేశారు. సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లిన ఘటనలో ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు ఏఆర్ఎస్ఐలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

