Mon Mar 16 2026 05:56:23 GMT+0530 (India Standard Time)
ఆ పరీక్షలన్నీ వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పలు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి

తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పలు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో బుధ, గురువారాల్లో ఓయూ, జేఎన్టీయూ, పొట్టి శ్రీరాములు యూనివర్సీటి పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్టార్ తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
హైదరాబాద్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆయా జోన్లలో గంటకు 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు, కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గాలులతో చెట్లు నేలకూలే ప్రమాదం, విద్యుత్తు స్తంభాలు దెబ్బతినడం, కరెంటు సరఫరాలో అంతరాయాలకు అవకాశం, చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరం అయితేనే బయటికి రావాలని సూచించింది.
Next Story

