Thu Mar 19 2026 23:00:30 GMT+0530 (India Standard Time)
గవర్నర్ దగ్గరకు కాంగ్రెస్ నేతలు.. ఎవరెవరంటే?
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కాంగ్రెస్ నేతలు కలిశారు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కాంగ్రెస్ నేతలు కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని వారు కోరారు. రేపు శాసన సభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని చెప్పారు. గవర్నర్ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావవేశంలో సోమవారం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని డీకే శివకుమార్ తెలిపారు. గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం బయటికి వచ్చిన డీకే మీడియాతో మాట్లాడారు. హోటల్ నుంచి గవర్నర్ను కలవడానికి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, పార్టీ ఇంఛార్జ్ థాక్రే, డీకే శివకుమార్, ఉత్తమ్కుమార్ రెడ్డి వెళ్లారు. సీఎం ఎవరన్నది ఫైనల్ కాలేదని, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాతే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సీఎం ఎవరనేది ఏఐసీసీలో ఇంకా నిర్ణయం కాలేదన్నారు. సీఎల్పీ సమావేశం సోమవారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది.
Next Story

