Sat Jul 27 2024 02:11:49 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : విద్యార్థులను కలసి వారి సమస్యలపై చర్చించి తర్వాత బావార్చిలో బిర్యానీ తిని
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరుద్యోగులను కలసి వారి సమస్యలపై చర్చించారు
![rahul gandhi, congress, unemployed, telangana rahul gandhi, congress, unemployed, telangana](https://www.telugupost.com/h-upload/2023/11/26/1563828-rahul.webp)
తెలంగాణ ఎన్నికల సమయంలో యువ ఎన్నికల ఓటర్లపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి. ప్రధానంగా నిరుద్యోగ సమస్యను తాము తీరుస్తామని, జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మంత్రి కేటీఆర్ నిరుద్యోగులతో సమావేశమై తాము మళ్లీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. తాజాగా రాహుల్ గాంధీ కూడా అశోక్ నగర్ వెళ్లి ఉద్యోగార్థులను కలసి చిట్ చాట్ చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యలు విని...
ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న యువకులతో సమావేశమయ్యారు. తాము అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి లీకులు లేకుండా పరీక్షలను సకాలంలో నిర్వహించడమే కాకుండా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వైఫల్యాలను కూడా ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వారి వద్ద ప్రస్తావించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు సమీపంలోని బావార్చి హోటల్ లో విద్యార్థులతో కలసి రాహుల్ గాంధీ బిర్యానీ తిన్నారు.
నేటి ప్రచార సభల్లో
ఈరోజు కూడా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు సాగనున్నాయి. ఈరోజు ఆంథోల్, సంగారెడ్డి, కామారెడ్డిలలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 11.30 గంటలకు ఆంథోల్ వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారు. అనంతరం 12.45 గంటలకు సంగారెడ్డికి వెళ్లి అక్కడ ప్రచారంలో పాల్గొంటారు. తర్వాత కామారెడ్డికి వెళ్లి అక్కడ రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
Next Story