Thu Mar 19 2026 05:51:03 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : మంత్రి వర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీ హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రి వర్గ విస్తరణపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం చేసిన మీరే, ఆగిపోయిందని కూడా అంటున్నారని రేవంత్ రెడ్డి చమత్కరించారు. ఏఐసీసీ నిర్ణయం మేరకే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ఆయన ఎందుకు ఆలస్యం అవుతుందన్నదీ తనకు తెలియదని, హైకమాండ్ నే అడగాలన్నారు.
అమిత్ షాను కలసి...
ఇప్పటికీ హైకమాండ్ పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ గురించి పరిశీలన చేస్తుందని తెలిపారు. తాము హోంమంత్రి అమిత్ షా ను కలసినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి చర్చించే విషయాన్ని తెలియచేశామని అన్నారు. ఇద్దరం సీఎంలం కలసి కూర్చుని రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరామని చెప్పారు. అనేక కీలక అంశాలు పరిష్కారం కావాల్సి ఉన్నందున తమ సమావేశంలో పరిష్కారమయ్యేవి అవుతాయని, లేనివి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన తెలిపారు.
Next Story

