Sat Jul 27 2024 02:20:49 GMT+0000 (Coordinated Universal Time)
భయపెడుతున్న గొంగళి పురుగుల మూక.. స్కూల్ కి సెలవు
గొంగళి పురుగులు.. ఒకటి రెండు కాదు.. పెద్దమొత్తంలో పాఠశాల మొత్తం వ్యాపిస్తే ఏం చేసేది ? పాఠశాల ఆవరణలో, గదుల్లో పాకుతూ..
![marrigudem govt school, caterpillar fear marrigudem govt school, caterpillar fear](https://www.telugupost.com/h-upload/2023/07/05/1518177-caterpillar.webp)
గొంగళి పురుగు గూడు కట్టగా.. దాని నుంచి వచ్చే సీతాకోక చిలుకలంటే అందరికీ ఇష్టమే. ఎగురుతున్న ఆ సీతాకోక చిలుకల్ని పట్టుకోవాలి పిల్లలు వాటివెంట పరిగెడుతుంటారు. కానీ.. అవే గొంగళిపురుగులను చూస్తే భయపడుతారు. ఎందుకంటే వాటిని ముట్టుకున్న, వాటిపై ఉండే నూగు పొరపాటున శరీరానికి అంటుకున్న వచ్చే దురద, మంట అంతా ఇంతా కాదు. దెబ్బకు చుక్కలు కనిపిస్తాయి. అలాంటి గొంగళి పురుగులు.. ఒకటి రెండు కాదు.. పెద్దమొత్తంలో పాఠశాల మొత్తం వ్యాపిస్తే ఏం చేసేది ? పాఠశాల ఆవరణలో, గదుల్లో పాకుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులపై పడుతుండటంతో మరోదారి లేక స్కూల్ కు సెలవు ప్రకటించారు. తెలంగాణలోని ములుగుజిల్లా వెంకటాపురం మండలంలోని మర్రిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుత పరిస్థితి ఇది.
ఈ ప్రభుత్వ పాఠశాల లోపల, వెలుపల, చెట్లపై మొత్తం గొంగళి పురుగులు తిష్టవేశాయి. పెద్దసంఖ్యలో పురుగులు పాఠశాలలోకి ప్రవేశించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు. చెట్లు, బిల్డింగ్ పై పాకుతూ.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పై పడుతుండటంతో ఒంటిపై దద్దుర్లు ఏర్పడి దురద, మంటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొంగళి పురుగుల్ని చూసి స్కూల్ కు రావాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉపాధ్యాయులు పాఠశాలకు సెలకు ప్రకటించారు. వెంటనే గొంగళిపురుల నివారణకు చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story