Sun Mar 22 2026 13:04:48 GMT+0530 (India Standard Time)
KTR : కేటీఆర్ ట్వీట్ చూసిన తర్వాతయినా... ఆ నేతలకు?
పార్టీ శ్రేణులను ఉత్సాహపర్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

బీఆర్ఎస్ నుంచి వరసపెట్టి కీలక నేతలు పార్టీని వీడి వెళుతున్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు అనేక పదవులు పొందిన నేతలు నేడు పవర్ పోగానే వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. దీంతో పార్టీ శ్రేణులను ఉత్సాహపర్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కొత్త నాయకులు వస్తారని ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ నాయకత్వం అంటే తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసునని కూడా కేటీఆర్ అన్నారు. త్వరలోనే పార్టీ మారే నేతలకు జవాబు చెబతారని కూడా సుతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేశారు.
ట్వీట్ లో...
"శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కేసీఆర్. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్ ది. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం" అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.
Next Story

