Thu Mar 19 2026 21:49:53 GMT+0530 (India Standard Time)
KTR : గెలిచేంత వరకూ విశ్రమించకండి
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అందరూ కృషిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అందరూ కృషిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. పార్టీ ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్ లో సమావేశమైన కేటీఆర్ కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పర్చేలా ఒత్తిడి తేవాలని కోరారు. వంద రోజుల సమయం ముగిసిన తర్వాత ఇక ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ హామీల గురించి, వాటిని అమలు చేయకపోవడంపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
క్యాడర్ లో జోష్...
హామీలను తప్పించుకునే ప్రయత్నాన్ని జనం సాక్షిగా ఎండగట్టాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్సీలకు ఇస్తున్న బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్నదీ ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వానికి తెలియజేయాలని కేటీఆర్ కోరారు. కిందిస్థాయి కార్యకర్తల్లో ఉన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు ప్రయత్నించాలని ఆయన పిలుపు నిచ్చారు. పార్టీ కోసం బాగా పనిచేసిన వారి శ్రమకు తగిన ఫలితం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆయన ఎమ్మెల్సీలను ఆదేశించారు.
Next Story

