Fri Dec 05 2025 16:38:15 GMT+0000 (Coordinated Universal Time)
KTR : అమరరాజా ఇక్కడి నుంచి వెళ్లిపోతుందటగా
అమరరాజా సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని వీడతామంటూ ప్రకటించటం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు

అమరరాజా సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని వీడతామంటూ ప్రకటించటం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దన్నారు. బ్రాండ్ తెలంగాణ ఇమేజ్కు నష్టం రాకుండా రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమరరాజా సంస్థ చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, అదే నిజమైతే చాలా దురదృష్టకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత...
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఖరేంటో అర్థంకాక చాలా సంస్థలు రాష్ట్రాన్ని వీడుతున్నాయన్న కేటీఆర్ కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్కు వెళ్లిపోయిందన్నారు. కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్ను చెన్నైకి తరలించిందన్నారు. ఇప్పుడు అమరరాజా కూడా వెళ్లిపోతానని చెబుతుంటే, ఇది తెలంగాణ బ్రాండ్కు తీవ్ర నష్టం చేస్తుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంతమాత్రం మంచిది కాదని కేటీఆర్ హితవు పలికారు.
Next Story

