చనిపోయిన వ్యక్తికి ఎక్కువ ఓట్లు
మరణించిన ఓ వ్యక్తి ఎన్నికల్లో గెలిచాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలోని చింతలతాన పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెర్ల మురళి మరణించినా

మరణించిన ఓ వ్యక్తి ఎన్నికల్లో గెలిచాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలోని చింతలతాన పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెర్ల మురళి మరణించినా, గ్రామస్థులు ఆయనకే పట్టం కట్టారు. 50 ఏళ్ల చెర్ల మురళి, గ్రామంలో చికెన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గతంలో వార్డు సభ్యుడిగా పనిచేశారు. సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్కు కేటాయించడంతో ఆయన బరిలో నిలిచారు. అయితే, డిసెంబర్ 4న ఆయన ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు. అభ్యర్థి మరణించినప్పటికీ, పోటీలో మరో ఐదుగురు ఉండటంతో ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహించారు. గ్రామస్థులు మాత్రం మురళిపై ఉన్న అభిమానంతో ఆయనకే ఓట్లు వేశారు. ఫలితంగా సమీప అభ్యర్థిపై 358 ఓట్ల మెజారిటీతో మురళి విజయం సాధించారు. ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా లేక ఉపసర్పంచికే బాధ్యతలు అప్పగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

