Thu Mar 26 2026 09:04:30 GMT+0530 (India Standard Time)
Breaking : ఈరోజూ టెన్త్ పేపర్ లీక్
ఈరోజు కూడా పదో తరగతి ప్రశ్నాపత్రం లీకయింది. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది

ఈరోజు కూడా పదో తరగతి ప్రశ్నాపత్రం లీకయింది. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం కావడంతో అధికారులు సయితం విస్తుబోయారు. నిన్న తెలుగు ప్రశ్నాపత్రం వికారాబాద్ జిల్లా తాండూరులో బయటకు వచ్చిన నేపథ్యంలో ఐదుగురిని సస్పెండ్ చేశారు. నిన్నటి లీకేజీ ఘటనను మరవక ముందే ఈరోజు మరో ప్రశ్నాపత్రం లీకవ్వడం సంచలనం కలిగిస్తుంది. వరంగల్ తో పాటు కరీంనగర్ జిల్లాలో ఈ పేపర్ బయటకు వచ్చినట్లు తెలిసింది. అయితే పరీక్ష కేంద్రం నుంచి విద్యార్థులు బయటకు వస్తేనే అసలు పేపరా? ఎవరైనా ఆకతాయిలు సోషల్ మీడియాలో నకిలీ పేపర్ ను పెట్టారా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై మరికాసేపట్లో స్పష్టత రానుంది.
హిందీ పేపర్...
దీనిపై విచారణ సాగిస్తున్న సమయంలోనే వరంగల్ లో ఈరోజు హిందీ ప్రశ్నాపత్రం బయటకు రావడం కలకలం రేపుతుంది. దీంతో కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వెంటనే కలెక్టర్ పోలీసులను ఆదేశించి దీనిపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. 9.30 గంటలకే ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం హిందీ పేపర్ లీక్ కాలేదని చెబుతున్నారు. పరీక్ష కేంద్రంలోకి కూడా ఇన్విజిలేటర్లను సెల్ ఫోన్లు తీసుకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నా ఎలా లీకయిందన్న దానిపై ఉన్నతస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
Next Story

