Sun Dec 14 2025 00:26:23 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : చినుకు పోయింది... వణుకు మొదలయింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. అయితే కొన్ని చోట్ల వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. అయితే కొన్ని చోట్ల వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా, సాయంత్రం నుంచి చలిగాలుల తీవ్రత పెరుగుతుంది. ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నందున రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఎక్కడా భారీ వర్షాలు మాత్రం ఉండవు. జల్లులు అలా పలకరించి వెళ్లిపోతాయన్నది వాతావరణ శాఖ అంచనా. ఇప్పటికే జూన్ నెల నుంచి ప్రారంభమైన వానలు మొన్నటి వరకూ సాగడంతో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఏజెన్సీ ఏరియాలో...
ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. మరొకవైపు చలితీవ్రత పెరిగే అవకాశముందని కూడా వాతావరణ శాఖ చెబుతుంది. నవంబరు నెలలో సాధారణంగా చలిగాలుల తీవ్రత ఉంటుంది. ఇది ఫిబ్రవరి వరకూ కొనసాగుతాయి. అందుకే ఈ చలిగాలుల్లో సాయంత్రం నుంచి రాత్రివేళ బయటతిరగవద్దని, ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు, ఆస్మా సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు, పాడేరు వంటి ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
పొడి వాతావరణమే...
తెలంగాణలో ఈరోజు వానలు పడే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. పొడి వాతావరణం మాత్రమే ఉంటుందని చెప్పింది. అయితే చలిగాలుల తీవ్రత తెలంగాణలోఅధికంగా ఉండే అవకాశముందని హెచ్చరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో 9 నుంచి పథ్నాలుగు డిగ్రీలకు పడిపోయే అవకాశముందని కూడా తెలిపింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల వరకూ పొగమంచు అలుముకుంటుంది. రహదారులపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు పాటించాలి. అలాగే చలినుంచి కాపాడుకోవడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Next Story

