Sun Feb 01 2026 23:57:07 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : యువత పోలింగ్ కు దూరం.. కానీ ఆక్సిజెన్ సిలిండర్ తో వచ్చి మరీ శేషయ్య
అనారోగ్యంతో బాధపడుతున్న శేషయ్య అనే వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్ తో వచ్చి ఓటు వేశారు.

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. అయితే హైదరాబాద్ లో ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత ఉత్సాహం చూపడం లేదు. ఓటు విలువ ఎంత తెలియజెప్పినప్పటికీ వారికి మొబైల్స్తో గడపడమే ఎక్కువగా ఇష్టం ఉన్నట్లు కనపడుతుంది. మొబైల్ ను వదిలి పోలింగ్ కేంద్రానికి వచ్చేందుకు వారు ఇష్టపడటం లేదు.
అనారోగ్యంతో బాధపడుతూ...
కానీ అనారోగ్యంతో బాధపడుతున్న వారు సయితం పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గచ్చిబౌలిలో ఈ ఘటన జరిగింది. గచ్చిబౌలిలోని జీపీఆర్ఏ క్వార్టర్స్ పోలింగ్ స్టేషన్ వద్ద అరుదైన దృశ్యం కనపడింది. శేషయ్య అనే వ్యక్తి లివర్ సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆయన తన వెంట ఆక్సిజన్ సిలిండర్ ను కూడా తెచ్చుకున్నారు.
1966 నుంచి ఇప్పటి వరకూ...
కానీ ఓటు విషయంలో మాత్రం శేషయ్య అశ్రద్ధ చేయలేదు. పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్ తో సహా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న శేషయ్యను చూసిన అక్కడి వారు తొలుత ఆశ్చర్యపోయినా తర్వాత అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడం మన కర్తవ్యమని, 1966 నుంచి తాను ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నానని, ప్రాణం ఉన్నంత వరకూ వేస్తానని శేషయ్య చెప్పారు. శేషయ్యను చూసైనా నేటి తరం నేర్చుకోవాలి. ఓటు విలువ తెలుసుకోవాలి.
Next Story

