Thu Mar 19 2026 14:49:04 GMT+0530 (India Standard Time)
Janasena : పొత్తు కుదిరింది.... జనసేన ఆ సీట్లలో పోటీ చేయడం గ్యారంటీ
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, పవన్ కల్యాణ్ పొత్తు ఖరారయింది. ఇరు పార్టీల మధ్య చర్చలు ముగిశాయి

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, పవన్ కల్యాణ్ పొత్తు ఖరారయింది. ఇరు పార్టీల మధ్య చర్చలు ముగిశాయి. తెలంగాణ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈ పొత్తు ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమావేశమై సీట్ల పంపంకపై చర్చించారు. పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన కిషన్ రెెడ్డి, లక్ష్మణ్ లు ఈ చర్చలు జరిపారు. జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ పొల్గొన్నారు. పొత్తు ఖరారయింది. సీట్లపై కూాడా క్లారిటీ వచ్చేసింది.
అవగాహన కుదిరింది....
ఇప్పటి వరకూ బీజేపీ మూడు విడతలుగా 88 స్థానాలకు తన పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. జనసేన 32 సీట్లు కోరుతున్నా ఒకటి, రెండు సీట్ల విషయంలో కొంత సందిగ్దత ఉన్నా మిగిలిన విషయాల్లో మాత్రం రెండు పార్టీల నేతలు అవగాహనకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ తెలంగాణలో కలసి పోటీ చేసేందుకు రెడీ అయ్యాయి. తెలంగాణలో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ పొత్తు కంటిన్యూ అవుతుందని ఆ తర్వాత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
మలివిడత జాబితాలో...
చర్చల అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తాము అడిగినన్ని సీట్లలో ఒకటి రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల క్లారిటీ వచ్చిందన్నారు. ఇద్దరం కలసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల7వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బీసీ సదస్సులోనూ తాను కూడా పాల్గొంటానని పవన్ కల్యాణ్ చెప్పారు. కేంద్రంలో మరోసారి బీజేపీ రావాలన్నదే తన ఆకాంక్ష అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇటు బీజేపీ నేతలు కూడా పవన్ కల్యాణ్ తో జరిపిన చర్చల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. పవన్ తో పొత్తుతో తమ బలం మరింత పెరిగిందని కమలనాధులు భావిస్తున్నారు. త్వరలోనే రెండు పార్టీల జాబితా ను విడుదల చేసే అవకాశముంది.
Next Story

