Sat Mar 07 2026 21:37:30 GMT+0530 (India Standard Time)
India vs Australia T20 : నేడు భారత్ - ఆస్ట్రేలియా రెండో టీ 20.. జరగడంపై అనుమానాలు
నేడు భారత్ - ఆస్ట్రేలియా రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలో రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది

నేడు భారత్ - ఆస్ట్రేలియా రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురం వేదికగా రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం గండం పొంచి ఉంది. కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ కూడా ఈరోజు కేరళలో వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించడంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. గత కొద్దిరోజులుగా కేరళను వర్షాలు వీడటం లేదు. నిన్న కూడా భారీ వర్షం పడటంతో పిచ్ ను తడవకుండా కాపాడేందుకు సిబ్బంది నానా తంటాలు పడ్డారు.
గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో...
ఈరోజు మ్యాచ్ ప్రారంభం అవుతుందా? లేదా? అన్న సందేహాలు మాత్రం ఉన్నాయి. ఎక్కువ శాతం వర్షం కురిసే అవకాశముందని తెలిసి క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ విశాఖలో జరిగింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా విజయం సాధించింది. 208 పరుగులను ఛేదించి మరీ గెలుపు సాధించింది. మొత్తం ఐదు మ్యాచ్ లు జరగాల్సి ఉండగా తిరువనంతపురంలో జరిగే మ్యాచ్ పై నీలి నీడలు అలముకున్నాయి. గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.
బౌలర్లకు అనుకూలం...
ఈ మ్యాచ్ రద్దయితే ఇక మూడు మ్యాచ్ లు మాత్రమే జరగాల్సి ఉంది. ఈ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. స్పిన్నర్లకు కలసి వస్తుందని చెబుతున్నారు. ఇక్కడ భారీ స్కోరు చేయడం ఎవరికైనా కష్టమే. ఫాస్ట్ బౌలర్లకు కూడా ఈ పిచ్ ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ స్టేడియంలో తొలుత టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ అసలు జరుగుుతందా? లేదా? అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి.
Next Story

