Wed Feb 04 2026 15:19:06 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు జైలు సింపతీ నామమాత్రమేనట
జగన్ పట్టు ఏమాత్రం సడలటం లేదు. అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా కానరావడం లేదు

జగన్ పట్టు ఏమాత్రం సడలటం లేదు. అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా కానరావడం లేదు. చివరకు చంద్రబాబు జైలులో ఉన్నా సింపతీ కౌంట్ కూడా పెద్దగా లేదు. ఇదీ టైమ్స్ నౌ సర్వేలో తేలిన నిజం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని సర్వే తేల్చింది. టైమ్స్ నౌ సర్వేలో 51.10 శాతం ఓట్లను సాధించి ముందు వరసలో నిలిచింది. ఇరవై అయిదు పార్లమెంటు స్థానాలకు గాను 24 నుంచి 25 స్థానాలను ఫ్యాన్ పార్టీ సొంతం చేసుకుంటుందన్న సర్వేలు వైసీపీలో మరింత జోష్ ను పెంచాయనే చెప్పాలి.
సింపతీ మాత్రం...
ఆంధ్రప్రదేశ్ లో ఏడు నెలల ముందే ఎన్నికల వేడి రాజుకుంది. పొత్తులు కుదురుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖరారయింది. పొత్తు తర్వాత కూడా సర్వేలో విపక్షాలకు షాక్ తగిలిందనే చెప్పాలి. టీడీపీకి ఒక స్థానం మాత్రమే దక్కే అవకాశాలున్నాయని తేల్చింది. జనసేనకు ఒక్క సీటు కూడా రాదని ఈ సర్వే తేల్చి చెప్పింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో జైలులో ఉన్నప్పటికీ సానుభూతి అంతగా రాలేదని టైమ్స్ నౌ సర్వేలో వెల్లడయింది. కేవలం 36.40 శాతం ఓట్లకే సైకిల్ పార్టీ పరిమితమయింది. జనసేనకు 10.1 ఓట్లు మాత్రమే వచ్చాయి.
సంక్షేమ పథకాలు...
జగన్ తొలి నుంచి తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు తిరిగి గట్టెక్కిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. ఆయన తాను బటన్ నొక్కి పంపిణీ చేస్తున్న నగదు మరోసారి తనను సీఎం కుర్చీలో కూర్చోపెడుతుందని నేతలకు నమ్మకంగా చెబుతున్నారు. వైనాట్ 175 అంటూ నినాదం నాట్ పాజిబుల్ అంటూ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. జగన్ అనుకున్నట్లే సర్వే ఫలితాలు కూడా వెల్లడవుతుండటంతో పార్టీ నేతల్లో మరింత హుషారు పెరిగింది. ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు ఈ ఏడునెలల్లో మరిన్ని పథకాలతో జనం ముందుకు వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతుంది.
Next Story
