అబద్ధాల్లో లోకేష్.. బాబును మించిన నేర్పరి: వైసీపీ ఎంపీ
ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు కంటే.. ఆయన కుమారుడు నారా
ఏపీ.. రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నేతల మధ్య నిత్యం మాటలయుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఇక ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు సరికొత్త పంథాలో ముందుకు సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు కంటే.. ఆయన కుమారుడు నారా లోకేషే ఎక్కువగా అబద్ధాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు, లోకేష్ తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్కు పారిపోతారని సెటైర్ వేశారు. ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్కు సినిమాలే ఆప్షన్ అంటూ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మాదిగకు ఏం చేశాడో చెప్పాలన్నారు. మాదిగలపై అక్రమ కేసులు పెట్టించింది చంద్రబాబు కాదా? అంటూ నందిగాం సురేష్ ప్రశ్నించారు. మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని.. చంద్రబాబు మాదిగలను మోసం చేశాడని మండిపడ్డారు. మాదిగలకు చంద్రబాబు ఎంపీ సీటు కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో దళితులకు ఎక్కడా జరగని మేలు.. ఏపీలో సీఎం జగన్ పాలనలో జరిగిందన్నారు. కొందరు నేతలు చంద్రబాబు కాళ్ల దగ్గర ఊడిగం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు.. రాజధానిలో ఎస్సీలను దొంగలు చిత్రీకరించారని ఆరోపించారు. వర్ల రామయ్యకి రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి చంద్రబాబు అవమానించడాడని అన్నారు.
ఎస్సీలుగా ఎవరు పుట్టాలని అనుకుంటారని చంద్రబాబు అవమానించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎస్సీలను తమ్ముళ్లు, అన్నలు, కుటుంబ సభ్యులుగా సీఎం జగన్ భావిస్తారని ఎంపీ నందిగాం సురేష్ పేర్కొన్నారు. రెండు ఎకరాల చంద్రబాబు ఇన్ని వేల ఎకరాలను ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తే చాలు.. కులాల మధ్య కుంపటి పెట్టడం చంద్రబాబుకు అలవాటని సురేష్ మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేశామని, అందుకే ఈ సారి 175 స్థానాలు గెలుస్తామని చెబుతున్నామన్నారు. తెలుగు దేశం అంటరానితనాన్ని పెంచి పోషిస్తోందని, టీడీపీ ప్రజలకు అంటరాని పార్టీ అంటూ ఎంపీ నందిగాం సురేష్ హాట్ కామెంట్స్ చేశారు.