Fri Dec 05 2025 19:56:07 GMT+0000 (Coordinated Universal Time)
లగడపాటి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో?
ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గత కొన్నేళ్లుగా రాజకేయాలకు దూరంగా

ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గత కొన్నేళ్లుగా రాజకేయాలకు దూరంగా ఉన్నారు. ఆయన తిరిగి రాజకీయాల్లోకి వచ్చే విషయమై చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు గుడ్బై చెబుతున్నానని ప్రకటించిన ఆయన.. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత సర్వేలతో వార్తల్లో నిలిచారనుకోండి. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ మరోసారి పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతలో ఆయన తన అనుచరులతో మీటింగ్ ని నిర్వహించడం.. ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారనే వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి.
విజయవాడ సిటీలోని ఓ హోటల్ లో లగడపాటి అనుచరులు రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి. విజయవాడ లోక్సభ స్థానం నుంచి ఆయనకు ఇష్టమైన పార్టీ నుంచి బరిలోకి దిగాలని అనుచరులు కోరుతున్నారని తెలిసింది. ఇక ఆయన రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అనుచరులు భావిస్తూ ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో త్వరలో సమావేశాలు నిర్వహించనున్నారు. అనుచరులతో జరిగే సమావేశంలో లగడపాటి రాజగోపాల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. లగడపాటి ఏ పార్టీలో ఉన్నా అభ్యంతరం లేదని ఆయనతో పాటే తామంతా అని ఆయన అనుచరులు చెబుతూ ఉన్నారు.
Next Story

