Fri Dec 05 2025 18:26:28 GMT+0000 (Coordinated Universal Time)
పీకే వెనుక సీఎం.. ప్రశాంత్ కిశోర్ పార్టీపై కోదండరామ్ ఆరోపణలు
పీకే (ప్రశాంత్ కిశోర్) వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు పీకేను వాడుకుంటున్నారని..

హైదరాబాద్ : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో పాటు.. రాజకీయ పార్టీ కూడా పెట్టబోతున్నట్లు సోమవారం ట్విట్టర్ వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. ప్రశాంత్ కిశోర్ రాజకీయ పార్టీ ప్రకటన.. దేశ రాజకీయాల్లో హీట్ పెంచింది. బీహార్ నుంచి తన రాజకీయ ప్రవేశం మొదలవుతుందని ప్రశాంత్ తెలిపారు. ప్రశాంత్ కిశోర్ రాజకీయ పార్టీ ప్రకటనపై టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ సంచలన ఆరోపణలు చేశారు.
పీకే (ప్రశాంత్ కిశోర్) వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు పీకేను వాడుకుంటున్నారని కోదండరామ్ ఆరోపించారు. కేసీఆర్ జాతీయ పార్టీ, పీకే పెట్టబోయే పార్టీ రెండూ ఒకటేననే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అలాగే ఉస్మానియాలో రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరణపై మాట్లాడుతూ.. రాహుల్ సభకు అనుమతిని ఇవ్వాలనేదే ఒక ప్రొఫెసర్ గా తన అభిప్రాయమని చెప్పారు. రాహుల్ రావాలని విద్యార్థులు కోరుకుంటున్నారని, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఇలా విద్యార్థులను కలవడం వల్ల వారికి మేలు జరుగుతుందని కోదండరాం అభిప్రాయపడ్డారు.
Next Story

