జగన్ వ్యూహం : మరింత ముందుకు ఎంపీల రాజీనామాలు!
చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచడానికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ వెల్లువెత్తుతున్నదో లేదా ప్రజా వ్యతిరేకత ఉన్నదో ఒకసారి లిట్మస్ టెస్ట్ చేసుకుని తాను ఇంకాస్త జాగ్రత్త పడడానికి వీలుగా విపక్షనేత వైఎస్ జగన్మోహన రెడ్డి తన వ్యూహానికి మరింతగా పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రత్యేకహోదా కోసం తన పార్టీ ఎంపీలతో అవసరమైతే రాజీనామాలు చేయించి ప్రజల తీర్పుకు వెళ్తాం అని ప్రకటించిన వైఎస్ జగన్ అదే అస్త్రాన్ని మరింత పదునుగా, తొందరగా ప్రయోగించే ఆలోచనతో ఉన్నట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది.
ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో అవసరమైతే రాజీనామా చేయిస్తానని జగన్ గతంలోనే ప్రకటించారు. మొన్నటికి మొన్న విశాఖ పట్టణం సభలో కూడా ఆ అంశాన్ని పునరుద్ఘాటించారు. కేంద్రానికి వచ్చే బడ్జెట్ సమావేశాల వరకు వ్యవధి ఇచ్చి , అప్పటిదాకా పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు హోదా కోసం పోరాటం చేస్తారని, అప్పటికీ కేంద్రం పట్టించుకోకపోతే గనుక.. వచ్చే బడ్జెట్ సమావేశాల తరువాత.. రాజీనామాలు చేసి ప్రజా తీర్పునకు వెళ్తాం అని జగన్ అన్నారు. అంటే వైకాపా ఎంపీల రాజీనామాలు వచ్చే మార్చి తర్వాత ఉండే అవకాశం ఉంది.
అయితే తాజాగా శనివారం నాడు వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు. అలాగే ఎంపీలు రాజీనామాలు అనుకుంటున్న పర్వాన్ని ఇంకాస్త ముందుకు తీసుకువస్తే ప్రయోజనం ఉంటుందని వారు భావించినట్లు సమాచారం.
చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నదని, దాన్ని విపక్షంగా మనం సొమ్ము చేసుకోలేకపోతున్నామని జగన్ నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. అవసరమైతే శీతాకాల పార్లమెంటు సమావేశాల తరువాత.. బడ్జెట్ సమావేశాలకు ముందే ఎంపీలతో రాజీనామాలు చేయించి.. ఉప ఎన్నికలకు వెళితే గనుక.. రాజీనామా చేసిన వారంతా నెగ్గితే చాలు.. తెలుగుదేశం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లుగా ఎస్టాబ్లిష్ అవుతుందని.. ఆ ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా జనాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చడానికి మరింత దోహదం చేస్తాయని జగన్ వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వ్యూహం ప్రకారం చూస్తే కొత్త సంవత్సరం రాగానే.. వైకాపా ఎంపీ ల రాజీనామాలు కొత్త సంచలనాలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.