కాంగ్రెస్ విజయం కోసం నిరీక్షిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్
బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని లేదా పోరాటాన్ని సమర్థించడానికి వారు ఒక్కమాట కూడా మాట్లాడక పోవచ్చు. తద్వారా ప్రజల దృష్టిలో తమకు రాగల మైలేజీ కాస్త పడిపోతుందని వారు ఆందోళన చెందవచ్చు. అయితే.. వాస్తవంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సాధించే విజయం కోసం వారు నిరీక్షిస్తున్నారు. కాంగ్రెస్ విజయం మీద ఆధారపడి తమ పోరాట పంథాను డిసైడ్ చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తున్నది. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎక్కడ వచ్చిందా అని అనుకుంటున్నారా? ఎమ్మెల్యేలు ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత.. పార్టీలు ఫిరాయించడానికి సంబంధించి.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పరిస్థితి ఇది. వివరాల్లోకి వెళితే...
ఎన్నికల్లో గెలిచి పార్టీలు అధికారంలోకి రాగానే.. విపక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలకు ఎర వేసి.. అధికార పార్టీలు తమలో కలిపేసుకుని విచ్చలవిడి పెడపోకడలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాలక పార్టీలు పోటీపడి ప్రయత్నాలు చేశాయి. తెలంగాణ తెరాస తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను దాదాపుగా ఖాళీ చేసింది. కాంగ్రెస్ పార్టీ వారిని కూడా పలువురిని తమలో కలిపేసుకుంది. ఇక్కడ తెరాస వైఖరి మీద న్యాయపోరాటం చేసినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ ఏపీ విషయానికి వచ్చేసరికి ఇదే వ్యూహాల్ని అనుసరించి, వైఎస్సార్ కాంగ్రెస్ లోని అనేక మంది ఎమ్మెల్యేలను తెదేపాలో చేర్చుకున్నది. పాలకపక్షాలు రెండూ ఎవరికి వారు.. తమ ప్రజారంజకమైన పాలనను చూసి.. అన్ని పార్టీల్లోని ఎమ్మెల్యేలు ఎగబడి వచ్చి తమతో జట్టు కడుతున్నారనే పడికట్టు మాటలనే చెప్పుకున్నారు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ ఫిరాయింపుల మీద కాస్త సీరియస్ గా పోరాటం చేస్తోంది. వారు వేసిన పిటిషన్ ఇప్పుడు సుప్రీం కోర్టులో రాజ్యాంగ ధర్మాసనం విచారణకు వెళ్లనున్నది. అదే సమయంలో ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడ్డంలో వైకాపా కూడా తక్కువ తినలేదు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ.. వారు ఏకంగా పార్లమెంటులో బిల్లు పెట్టారు. ఎన్నికైన తర్వాత ఫిరాయించిన వారిపై వేటు వేసే అధికారం స్పీకరుకు కాకుండా.. ఎన్నికల సంఘానికి ఉండాలనేది ప్రధానంగా వైకాపా కోరుతున్న సవరణ.
అయితే ఈ బిల్లు ఎప్పుడు పార్లమెంటులో చర్చకు వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ రాజ్యాంగ ధర్మాసనం వరకు తీసుకువెళ్లిన పిటిషన్ లో విజయం సాధిస్తే గనుక.. పార్లమెంటులో చట్ట
సవరణకు తాము చేసే పోరాటానికి నైతిక మద్దతు లభిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ విజయం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది.